
జనం న్యూస్ ; తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 8,9 తదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రరాజధాని హైదరాబాద్ వేదికగా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ‘తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి’ అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ లో జరగనున్న ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అతిరథ మహారథులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. UAE రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, రస్ అల్ ఖైమా ప్రతినిధులు, డుయిష్ బోర్సే గ్రూప్ హెడ్ లుడ్విగ్ హింజెల్మన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి విన్స్టన్ , మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెన్నెట్ నియో తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు. పెట్టుబడులకు గమ్య స్థానం తెలంగాణ ‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్మ్యాప్ను రూపొందించింది. ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. లయోనెల్ మెస్సీ.. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) లయనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది.