ఈ 6 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

★దిత్వా తుఫాన్ ఎఫెక్ట్, ★...కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు

సాక్షి డిజిటల్ న్యూస్: దిత్వా తుఫాన్ ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మరోవైపు మధ్యఆంధ్రప్రదేశ్ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిత్వా తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న రెండు రోజులు వాతావరణ వివరాలు క్రింది విధంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆదివారం (30-11-2025) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం (01-12-2025) ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు; కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ఆదేశాలు హోం,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలనుసారం అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో మండలస్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చామన్నారు. ముందస్తుగానే ప్రభుత్వ శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేశామన్నారు.సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులని వెనక్కి రప్పించామని, రైతాంగానికి భారీవర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నామన్నారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.