
సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్ ఐటీ కారిడార్లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. వైమానిక రంగానికి చెందిన ఈ ఫార్చ్యూన్ 500 సంస్థ.. దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాథమికంగా 1,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇది జీసీసీ బోయింగ్ లేదా ఎమిరేట్స్ గ్రూప్కు చెందినదై ఉండవచ్చని ఐటీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరమే 31 ఫార్చ్యూన్ 500 సంస్థలు హైదరాబాద్లో కార్యాలయాలు ప్రారంభించగా.. ఈ కొత్త సంస్థ రాక నగర వృద్ధిని మరింత పెంచనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఐటీ రంగం తన వృద్ధిని మరింత పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే ప్రపంచ సంస్థలకు కేంద్రంగా మారిన ఈ నగరంలోకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్లో దాదాపు 4 లక్షల చదరపు అడుగుల (చ.అ.) భారీ విస్తీర్ణంలో ఈ సంస్థ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను (జీసీసీ) ఏర్పాటు చేసే ప్రక్రియలు వేగవంతమవుతున్నాయి. వైమానిక రంగానికి చెందిన ఫార్చ్యూన్ 500 సంస్థ..కొత్తగా రానున్న ఈ జీసీసీ.. వైమానిక రంగానికి చెందిన ప్రముఖ సంస్థదిగా తెలుస్తోంది. ఇది ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న అతి పెద్ద అంతర్జాతీయ దిగ్గజాలలో ఒకటి అని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నియామక ప్రక్రియను ప్రస్తుతం మియామిన్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ జీసీసీ ఏర్పాటు ద్వారా ప్రాథమికంగా సుమారు 1,000 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు భారీ ప్యాకేజీలు అందించనున్నట్లు రిక్రూట్మెంట్ సంస్థ చెబుతున్నప్పటికీ.. క్లయింట్ పేరును మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఐటీ వర్గాలలో జరుగుతున్న ఊహాగానాల ప్రకారం.. ఈ కొత్త జీసీసీ బోయింగ్ లేదా ఎమిరేట్స్ గ్రూప్కు చెందినదై ఉండొచ్చని బలంగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.