
సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ధాన్యంకొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘రైతు Hi అంటే చాలు... ధాన్యం కొనుగోలు పనులు చకచకా జరుగుతాయి’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ నంబర్ 73373 59375 నెంబర్తో ఇక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. 73373-59375 నెంబర్ను ఇందుకు కేటాయించామని మంత్రి అన్నారు. ధాన్యం అమ్మదలచిన రైతులు వాట్సాప్ నెంబర్ కు Hi అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. స్లాట్ బుకింగ్ విధానం ‘రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత... రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది’అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ‘అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాదరబందీ లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం... ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్. ‘సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తోంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి’అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.