పయనించే సూర్యుడు : రైతుల ఆదాయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రైతుల అభివృద్ధికి పంచసూత్రాలు తీసుకొచ్చాం అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలాగే గత ఐదేళ్లలో భూసార పరీక్షలు నిలిపేశారు. మళ్లీ వాటిని మొదలు పెట్టాం అని చెప్పుకొచ్చారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. రైతు మీసం మెలేసే రోజులు రాబోతున్నాయి. మొంథా తుఫాన్ బాధిత రైతులకు త్వరలో రూ.390 కోట్లు ఇస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నదాతకు అండగా నిలిచేందుకు.. పంచసూత్ర ప్రణాళికతో వెళ్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు ఐటీ నిపుణులకు ఎంత మంచి పేరు ఉందో… ఏపీ రైతులు కూడా ప్రపంచ వ్యాప్తంగా అదే స్థాయిలో గుర్తింపు రావాలి అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. రెండో విడత చెల్లింపుల్లో భాగంగా రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ చేశారు. రచ్చబండలో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాలు అవలంభించాలి. సాగులో టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడితే పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. మనది రైతు ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడతలో రూ.3,175 వేల కోట్ల సొమ్మును ఈ ఏడాది ఆగస్టులో జమ చేశాం. రెండు విడతలు కలిపి మొత్తం రూ.6,310 కోట్లు అన్నదాతకు అందించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం నిధులు జమ చేయడం రైతు సంక్షేమంపై ప్రజా ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం’అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పంచ సూత్రాల అమలుతో రైతే రాజు ‘నీరు సమృద్ధిగా ఉన్నచోటే అభివృద్ధి జరిగింది. రాయలసీమ వాసుల కష్టాలు నేను కళ్లారా చూశాను. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నదే నా సంకల్పం. భూగర్భ జలాలు పెంచాలి. ఒకప్పుడు సీమలో 100 అడుగుల కింద నీరు ఉండేది. ఇప్పుడు 7.3 మీటర్లకే నీరు వస్తోందంటే మన దూరదృష్టి వల్లే సాధ్యమైంది. ఆనాడు నా నియోజకవర్గం కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్కు వెళ్లాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘ భూగర్భ జలాలు పెరిగితే పర్యావరణం కూడా బాగుంటుంది. రాష్ట్రంలో నీటిభద్రత కల్పించేందుకు నిరంతరం పని చేస్తున్నాం. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీరందించాం. సముద్రంలోకి వృథాగా పోయే వరద నీటిని రాయలసీమ వైపు మళ్లించి రిజర్వాయర్లు నింపాం. హంద్రినీవా ద్వారా సీమకు నీరిచ్చాం. రాష్ట్రంలో 95 శాతం జలాశయాలు నిండాయి. చెప్పిన విధంగా నదుల అనుసంధానం చేసి చూపిస్తాం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉండబట్టే రైతులకు మేలు జరుగుతోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి సేద్యం చేయాలి డిమాండ్ ఉన్న పంటలు పండించాలి ‘ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా మన సాగు పద్ధతులు మారాలి. ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లాలి. డిమాండ్ ఉన్న పంటలను పండించాలి’అని సీఎ చంద్రబాబు నాయుడు ఆదేశించారు.‘రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. ఇంకో 6 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యం పరిధిలోకి తీసుకువస్తున్నాం. మొత్తంగా 18 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ‘రైతులకు మరింత ఆదాయం చేకూరేలా రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సీఐఐ సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో ఫుడ్ ప్రాసెసింగ్కు ప్రోత్సాహం ఇస్తున్నాం. మన రాష్ట్రంలో పండని పంట లేదు. అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్లో మనకు తిరుగులేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘పశుపోషణ, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో మనం ముందున్నాం. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా, కోస్తా ఆక్వా హబ్ గా తయారవుతోంది. అరకులో కాఫీని ప్రోత్సహిస్తున్నాం. సర్కారీ సాయంతో వ్యవసాయాభివృద్ధి ‘ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తక్షణం స్పందిస్తున్నాం. మార్కెట్ ఇంటర్వేన్షన్ ద్వారా రైతులను ఆదుకుంటాం. పంటలకు మద్దతు ధర లేకున్నా విపత్తులు సంభవించినా… వెంటనే స్పందిస్తున్నాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చాక విపత్తులకు నష్టపరిహం నిమిత్తం రూ. 310 కోట్లు చెల్లింపులు జరిపాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి రూ.15,955 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నా మొంథా తుఫానుకు నష్టపోయిన రైతులకు రూ.390 కోట్ల పరిహరాన్ని త్వరలో చెల్లిస్తాం’ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సంక్షేమం అందిస్తాం. అభివృద్ధి చేస్తాం ‘2024 సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే తల్లికి వందనం, స్త్రీ శక్తి-ఉచిత బస్సు, దీపం –2, ఎన్టీఆర్ భరోసా పించన్లు, మెగా డీఎస్సీ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశాం. విధ్వంస, ఆటవిక పాలన ఎలా ఉంటుందో గత పాలనలో చూశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాయలసీమను పారిశ్రామిక హబ్గా తయారుచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.